Omicron: 20 దేశాలకు వ్యాపించిన ఒమిక్రాన్‌

ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ గురించి తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూడటానికి ముందే... గత అక్టోబరులోనే ఈ కొత్త వేరియంట్‌ పలు దేశాలకు వ్యాపించినట్టు స్పష్టమవుతోంది.

Updated : 02 Dec 2021 05:08 IST

 దక్షిణాఫ్రికా కంటే ముందే నైజీరియాలో నమోదు

  యూరోపియన్‌ దేశాల్లో 44కు చేరిన కొత్త వేరియంట్‌ బాధితులు

టోక్యో: ప్రపంచాన్ని వణికిస్తున్న ఒమిక్రాన్‌ గురించి తాజాగా మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాలో తొలిసారి వెలుగు చూడటానికి ముందే... గత అక్టోబరులోనే ఈ కొత్త వేరియంట్‌ పలు దేశాలకు వ్యాపించినట్టు స్పష్టమవుతోంది. అయితే, దీని తీవ్రత ఏ స్థాయిలో ఉంటుంది? టీకా వల్ల కలిగే రోగనిరోధక శక్తిని ఇది తప్పించుకుంటుందా? అన్న కీలక విషయాల్లో మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. పలు ఐరోపా దేశాల్లో డెల్టా కారణంగా పెద్దసంఖ్యలో బాధితులు ఆసుపత్రుల్లో చేరుతున్న క్రమంలోనే, ఒమిక్రాన్‌ కేసులు కూడా నమోదవుతున్నాయి. కొత్త వేరియంట్‌ కారణంగా యూరోపియన్‌ యూనియన్‌లోని 11 దేశాల్లో ఇప్పటివరకూ 44 కేసులు నమోదయ్యాయి! వీరిలో చాలామంది ఆఫ్రికా దేశాలకు వెళ్లి వచ్చినవారేనని తేలింది. తాజాగా మరిన్ని దేశాల్లో ఒమిక్రాన్‌ కేసులు వెలుగుచూశాయి. దీంతో ఈ వేరియంట్‌ వ్యాపించిన దేశాల సంఖ్య 20కు చేరింది.

 అక్టోబరు ప్రారంభంలోనే తొలికేసు? 

నైజీరియాలో ఒమిక్రాన్‌ తొలి కేసు నమోదైంది. అక్టోబరులో సేకరించిన నమూనాలను పరీక్షించగా కొత్త వేరియంట్‌ నిర్ధారణ  అయినట్టు ఆ దేశ జాతీయ ప్రజాఆరోగ్య సంస్థ బుధవారం వెల్లడించింది. కొత్త వేరియంట్‌ గురించి దక్షిణాఫ్రికా అప్రమత్తం చేయడానికి కొన్నివారాల ముందే అక్కడి నుంచి వచ్చినవారి నుంచి ఈ నమూనాలను సేకరించినట్టు తెలిపింది. ఆఫ్రికా నుంచి ఇటీవల సౌదీ అరేబియా వచ్చిన ఓ వ్యక్తికి ఒమిక్రాన్‌ సోకినట్టు పరీక్షల్లో నిర్ధారణ అయింది.

అంతర్జాతీయ విమానాలపై ఆంక్షలు

డిసెంబరు చివరి వరకూ కొత్త రిజర్వేషన్లను తీసుకోవద్దని అంతర్జాతీయ ఎయిర్స్‌ లైన్స్‌ సంస్థలను జపాన్‌ ఆదేశించింది. దేశంలో రెండు ఒమిక్రాన్‌ కేసులు నమోదైనందున, అత్యవసర చర్యల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్టు తెలిపింది. నవంబరు 22 నుంచి దేశ వ్యాప్తంగా అమలుచేస్తున్న లాక్‌డౌన్‌ను ఆస్ట్రియా సర్కారు ఈనెల 11 వరకూ పొడిగించింది. అత్యవసర వస్తువుల దుకాణాలను ఇకపై సాయంత్రం 7 గంటలకే మూసివేయాలని ఆదేశించింది. క్రిస్మస్‌ ట్రీ అమ్మకాలకు ప్రత్యేక అనుమతులు ఇచ్చింది. ఒమిక్రాన్‌పై చర్చించేందుకు అత్యవసరంగా బ్లాక్‌ లీడర్స్‌ స్థాయి సమావేశం నిర్వహించాలన్న ప్రతిపాదనను యురోపియన్‌ యూనియన్‌ నిరాకరించింది. డిసెంబర్‌ 16న నేతల సమావేశానికి ముందు... 27 దేశాల ఆరోగ్యశాఖ మంత్రులు ప్రస్తుత పరిస్థితులను అంచనా వేస్తారని ఈయూ అధికారి తెలిపారు. ప్రస్తుతం జర్మనీ, ఆస్ట్రియా, దక్షిణ కొరియాల్లో డెల్టా కారక కేసులు ఇబ్బడి ముబ్బడిగా పెరుగుతున్నాయి.

విదేశాల నుంచి రాక.. ఆరుగురికి పాజిటివ్‌!

దిల్లీ: దక్షిణాఫ్రికా తదితర ఎట్‌-రిస్క్‌ దేశాల నుంచి 3,476 మంది ప్రయాణికులు బుధవారం భారత్‌ వచ్చారు. వీరికి పరీక్షలు నిర్వహించగా, ఆరుగురికి కొవిడ్‌ పాజిటివ్‌ వచ్చింది. దీంతో వారి నమూనాలను జీనోమ్‌ సీక్వెన్సింగ్‌ నిమిత్తం ప్రయోగశాలకు పంపారు. కేంద్ర ఆరోగ్యశాఖ ఈ వివరాలు తెలిపింది. వీరిలో నెదర్లాండ్స్‌, బ్రిటన్‌ నుంచి వచ్చినవారు నలుగురు ఉన్నారు. ప్రస్తుతం ఈ ఆరుగురిని లోక్‌నాయక్‌ జయప్రకాశ్‌ నారాయణ్‌ ఆసుపత్రికి తరలించినట్టు సంబంధిత వర్గాలు తెలిపాయి. ఒమిక్రాన్‌ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయ ప్రయాణికులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన కొత్త నిబంధనలు బుధవారం నుంచి అమలులోకి వచ్చాయి. దక్షిణాఫ్రికాతో పాటు బ్రిటన్‌, బ్రెజిల్‌, బోట్స్‌వానా, చైనా, మారిషస్‌, న్యూజిలాండ్‌, జింబాబ్వే, సింగపూర్‌, హాంకాంగ్‌లను కేంద్రం ఎట్‌-రిస్క్‌ దేశాలుగా పేర్కొన్న సంగతి తెలిసిందే.

Tags :

Trending

గమనిక: ఈనాడు.నెట్‌లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి. పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర ప్రత్యుత్తరాలకి తావు లేదు.

మరిన్ని